Veerabhadruni Rahasyam Review: ‘మర్మదేశం’ సీక్వెల్ ఎలా ఉందంటే..
ఒకప్పుడు అంటే 1990ల్లో ప్రేక్షకులను ‘మర్మదేశం’ అనే సీరియల్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అప్పటి వరకూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో సీరియల్ అభిమానులకు పెద్దగా తెలియదనే చెప్పాలి.
వెబ్సిరీస్: వీరభద్రుని రహస్యం
విడుదల: 05-07-2028
ఓటీటీ ప్లాట్ఫాం: జీ5
నటీనటులు: అన్నీ, రఘు కుంచె, రఘు, అభినవ్, కమల్ తూము, అనురాధ తదితరులు
మ్యూజిక్: సుధా శ్రీనివాస్
ఎడిటర్: రాగం సత్య నితీశ్
దర్శకుడు: నాగ
ఒకప్పుడు అంటే 1990ల్లో ప్రేక్షకులను ‘మర్మదేశం’ అనే సీరియల్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అప్పటి వరకూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో సీరియల్ అభిమానులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ ఈ సీరియల్.. స్టార్టింగ్ టు ఎండింగ్ గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో అదరగొట్టింది. అప్పటి వరకూ టెలివిజన్ చరిత్రలో అలాంటి సీరియల్ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇంతకాలానికి ‘మర్మదేశం’ సీక్వెల్ వచ్చింది. ‘మర్మదేశం’ను తెరకెక్కించిన నాగ ఈ సిరీస్కు కూడా దర్శకత్వం వహించారు. ‘వీరభద్రుని రహస్యం’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుందా? చూద్దాం.
కథేంటంటే..
1972, 1990ల మధ్య కథను సమాంతరంగా సాగుతూ ఉంటుంది. తొలుత వెబ్ సిరీస్ 1972లో ప్రారంభమవుతుంది. గుర్రం బొమ్మను చూపిస్తూ సిరీస్ ప్రారంభమవుతుంది. వీరభద్రపురం అనే గ్రామంలోని ప్రజలకు వీరభద్రుడు గ్రామ దైవం. పిల్లలు కార్తికేయ, శీను ఆడుకుంటుండగా శీను సడెన్గా మాయమవుతాడు. కార్తికేయ భయంతో వీరభద్రుని ఆలయం దిశగా వెళతాడు. కట్ చేస్తే.. యోగానందం (రఘు కుంచె) కూతురు కల్పన, తన స్నేహితురాలు తమ గ్రామాన్ని చూడాలనడంతో వెన్నెల (అన్నీ)తో కలిసి వీరభద్రపురానికి వస్తుంది. వాళ్లను రిసీవ్ చేసుకునేందుకు కల్పన అన్న కార్తికేయ బస్సు దగ్గరకు వెళతాడు. కల్పన కోరిక మేరకు ముగ్గురూ కలిసి వీరభద్రుని ఆలయానికి వెళతారు. దైవభక్తి లేని వెన్నెల దూరంగా ఉంటూ అంతా షూట్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో తనకు పెద్ద గంట కనిపిస్తుంది. గంటను టచ్ చేయడానికి యత్నించగా ఆలయ పూజారి వద్దని చెబుతాడు. ఆతరువాత గంట గురించి చెబుతారు. అది ధర్మగంట అని.. దుష్ట సంహారం తరువాత వీరభద్రుడే మోగిస్తాడని చెబుతాడు. ఇక చీకటి పడగానే ప్రతి ఇంటికీ గడియ వేసుకుని ఎవరి ఇళ్లలో వారే ఉండిపోతారు. ఆ తరువాత ధర్మ గంట మోగుతుంది. ఎవరు చనిపోయారా అని అంతా ఆలయం వైపు పరిగెడతారు. అక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది. సెకండ్ ఎపిసోడ్లో ఒంటరి వాడైన కార్తికేయను వీరభద్రుడు ఎత్తుకుని వస్తుంటాడు. ఒకచోట దింపి ఇంటికి వెళ్లమంటే తనకు భయమని కార్తికేయ చెప్పడంతో వీరభద్రుడు తన కత్తిని ఇచ్చి పంపిస్తాడు. కార్తికేయను అతని తండ్రి యోగానందం రాత్రి వేళ బయటకు వెళతావా? అని కొడతాడు. ఆ తరువాత అతని చేతిలో ఉన్న కత్తిని తల్లి గమనించి ఎక్కడదని అడుగుతుంది. వీరభద్రుడు ఇచ్చాడని చెప్పడంతో ఆ కత్తిని పూజ గదిలో పెట్టి పూజ చేస్తారు. ఇక యోగానందం దగ్గర పని చేసే వీరబాబు కొడుకు రాంబాబునే వీరభద్రుడ1970, 90లలో చూపిస్తున్నారని మనకు అర్థమవుతుంది. అసలు వీరభద్రుడు నిజంగానే ఆ గ్రామాన్ని రక్షిస్తున్నాడా? రాంబాబుని చంపేసింది వీరభద్రుడేనా? ఎందుకు శవాన్ని గద్దల గుట్టపై పడేస్తారు? ఇవన్నీ చూసిన వెన్నెల ఏం చేస్తుంది? 0వంటి అంశాలను తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కథ చాలా సైలెంట్గా సాగిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఎక్కడా హడావుడి లేదు. వింటేజ్ సిరీస్లను చూడాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్గా చెప్పవచ్చు. ప్రతి వారం ఐదు ఎపిసోడ్స్ విడుదలయ్యాయి. కథ 1970, 90లలో నడుస్తున్నా మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. వీరభద్రుని రహస్యమేంటో తెలుసుకునేందుకు యత్నిస్తున్న వెన్నెల ఎవరనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. తండ్రి కోసం వీరభద్రపురానికి వస్తుంది. తండ్రి రామస్వామి ఎవరు? ఎందుకు వారిని విడిచి వెళ్లిపోయాడనేది సస్పెన్స్. కంప్లీట్గా వీరభధ్రపురం గ్రామంలోని వారివన్నీ అభూత కల్పనలే అన్నట్టుగా కూడా చూపించకుండా.. మనల్ని నిజానిజాల్ని చూపిస్తూ కథ సాగుతుంది. అన్ని చావులకి కారణం వీరభద్రుడు కాదని మనకు తెలియజేస్తూ కథ సాగుతుంది. మొత్తంగా 60 ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్ నుంచి ప్రస్తుతానికి విడుదలైంది ఐదు ఎపిసోడ్లే కాబట్టి ఇంకా పూర్తి స్థాయి కథలోకి వెళ్లలేదనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే..
ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్లో ప్రస్తుతానికైతే ప్రధాన పాత్రలు రెండే. ఒకటి రఘు కుంచె అయితే మరొకరు అన్నీ. రఘు కుంచె అయితే తన పాత్రలో ఒదిగిపోయారు. ాయన పాత్రలో వేరియేషన్ ఉండే అవకాశం లేకపోలదనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా కూల్గానే ఉన్నారు. ఇక అన్నీ విషయానికి వస్తే వెన్నెల పాత్రలో ఒదిగిపోయింది. నాస్తికురాలు కావడంతో గ్రామంలో జరిగే హత్యకు వీరభద్రుడు కాదని నమ్ముతూ సాగే ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. ఇక యోగానందం (రఘు కుంచె) తల్లిగా నటించిన అనురాధ చాలా భయంకరంగా ఉంటుంది. తన పాత్ర పూర్తి స్థాయిలో రివీల్ కాలేదు. జస్ట్ కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తుంది. కాకపోతే చాలా గంభీరంగా.. చూడగానే భయం పుట్టించేలా ఉన్నారు. ఇక మిగిలిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు నాగ.. 1990ల చివరలో టెలివిజన్ ధారావాహిక ‘మర్మదేశం’కు దర్శకత్వం వహించిన అనుభవం ఉండటంతో ఈ వెబ్సిరీస్ను కూడా చక్కగా తీర్చిదిద్దుతారని ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని అయితే ఆయన దెబ్బ తీయరనే అనిపిస్తోంది. ముఖ్యంగా 1970, 1990 రెండు కథలను ఏకకాలంలో నడిపిస్తూ ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చూశారు. మ్యూజిక్ విషయానికి వస్తే పెద్ద పెద్ద సౌండ్స్ లేనిపోని హంగామా లేకుండా కథకు అనుగుణంగానే బీజీఎంని ఇచ్చారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబమంతా కూర్చొని చూడవచ్చు.
ఫైనల్గా.. వీరభద్రుని రహస్యం ఆసక్తికరంగానే ఉంది.
రేటింగ్: 3/5