Politics

Nagababu: రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన నాగబాబు!

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. జనసేనలో నెంబర్.2గా ఓ వెలుగు వెలిగిన.. వెలుగుతున్న ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.!

Nagababu: రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన నాగబాబు!

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. జనసేనలో నెంబర్.2గా ఓ వెలుగు వెలిగిన.. వెలుగుతున్న ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.! అదేనండి.. ఇకపై ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనని.. ఎలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పేశారు.

అందరూ రాజులు కావాలంటే, సేవ చేసేదెవరు? అన్నట్టుగా ఉంది నాగబాబు తాజా నిర్ణయం. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) రాజకీయాలలో అత్యున్నత శిఖరాన్ని చేరుకోగా.. ఆయనకు సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నాగబాబు మాత్రం హఠాత్తుగా ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం ఇప్పుడు జనసేన వర్గాలలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలోనూ హాట్ టాపిక్.

సామాన్యుడి పరిస్థితి ఏంటి?

రాజకీయాలలో అడుగుపెట్టడం చాలా సులువు, కానీ నిలబడడం కష్టం అన్న మాటను ఈ పరిణామం గుర్తు చేస్తోంది. నిజంగా చెప్పాలంటే, పవన్ (Pawan) రాజకీయ ప్రయాణంలో నాగబాబు (Nagababu) ఒక బలమైన నైతిక, భావోద్వేగ మద్దతుదారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంలో, పార్టీ సిద్ధాంతాలను బలంగా వినిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, డిప్యూటీ సీఎం అన్న పరిస్థితి ఇలా అయ్యిందేంటి? అని సామాన్య కార్యకర్త సైతం విస్మయం చెందుతున్నారు. నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని అహర్నిశలు ప్రయత్నించినా, కూటమిలో ఆ సీటు బీజేపీకి కేటాయించడం జరిగింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లాలన్న ఆశ అడియాశలు అయ్యాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేయడంతో ఆంధ్రాకు పరిమితం అయ్యారు. మంత్రి పదవిపై పవన్, సీఎం చంద్రబాబు (CM Chandrababu) బహిరంగంగా మాట్లాడినా, అది మాత్రం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మంత్రి పదవి ఆలస్యం కావడానికి నాగబాబు ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత నిరాసక్తత కారణమని ప్రచారం జరుగుతున్నా, మెగా బ్రదర్ ఈ పదవి కోసం ఎవరిపైనా ఒత్తిడి చేయకపోవడం గమనార్హం.

ప్రచారానికి చెక్..!!

ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే ఇంతటి కీలక నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే సంతృప్తి ఉంటుందని నాగబాబు పేర్కొనడం కేవలం వ్యక్తిగత నిరాడంబరత మాత్రమే కాదు, తెర వెనుక రాజకీయ వ్యూహం లేదా ఒత్తిడి కూడా ఉందనే చర్చకు దారి తీస్తోంది. ఈ మధ్యకాలంలో నాగబాబు ఉత్తరాంధ్రపై, ముఖ్యంగా శ్రీకాకుళంపై దృష్టి పెట్టారు. తరచుగా అక్కడి పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడం, బలోపేతంపై దృష్టి సారించడంతో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. పామును పట్టుకున్నవాడికి దాని మెలికలు తెలుస్తాయి అన్నట్టుగా, ఈ ప్రచారం కూటమి రాజకీయాల్లో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.

ఎటు నుంచి ఎటో..!

శ్రీకాకుళం లోక్‌సభ స్థానం టీడీపీ (TDP)కి కంచుకోట అన్నది జగమెరిగిన సత్యమే. అక్కడ ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఉన్నారు. ఇలాంటి చోట నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరిగితే, అది కూటమిలో అనవసరమైన గందరగోళానికి, సీట్ల పంపకాలపై అపనమ్మకానికి దారి తీస్తుంది. ఈ అనవసర ప్రచారాలకు, ఎక్కడ కాలు పెడితే అక్కడ పోటీ అనే ఊహాగానాలకు ముగింపు పలకడానికి నాగబాబు ఈ గుడ్ బై అస్త్రాన్ని ప్రయోగించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి రాజకీయాలకు గుడ్ బై చెప్పినా, వచ్చే ఎన్నికల నాటికి, కాలం కలిసొస్తే.. వాలకం మారుతుంది అన్నట్టుగా, పార్టీకి అత్యంత అనుకూలమైన, విజయావకాశాలు ఉన్న సీటు దొరికితే.. నాగబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ప్రస్తుతానికైతే, ఉపముఖ్యమంత్రి అన్న రాజకీయ బరి నుంచి తప్పుకోవడం, మెగా అభిమానుల్లో, జనసైనికుల్లో కొంత నిరాశను మిగిల్చింది. ఆయన తన పూర్తి శక్తిని పార్టీ బలోపేతం కోసం వెచ్చిస్తారని ఆశిద్దాం.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 14, 2025 1:49 PM