ఆయన క్లారిటీతోనే ఉన్నారు.. మనకే అర్థం కాలే..
‘మాట తప్పను.. మడం తిప్పను..’ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడిన పాట ఇది. మరి అధికారం కోల్పోయాక పరిస్థితేంటి? అప్పుడే మాటపై నిలబడలే.. ఇప్పుడింకేం నిలబడతారు?

‘మాట తప్పను.. మడం తిప్పను..’ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడిన పాట ఇది. మరి అధికారం కోల్పోయాక పరిస్థితేంటి? అప్పుడే మాటపై నిలబడలే.. ఇప్పుడింకేం నిలబడతారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇంకా చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల సీన్లోకి ఎంటర్ అవలే.. అయితే జగన్ చేసిన పనికి మాటలతోనే చీల్చి చెండాడుతారేమో..
ఇంతకీ అసలు జగన్ (YS Jagan) ఏం చేశారో చెప్పకుండా? మాకేంటిది అంటారా? ఏముంటుంది.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ‘మా ఫుల్ సపోర్ట్ ఎన్డీఏకే’ అంటూ ప్రకటించేశారు. ఇది ముందు ఊహించిందే. అయితే ఎక్కడో చిన్న డౌటానుమానం ఏంటంటే.. ఇండియా (INDIA) కూటమికి తమ మద్దతుప్రకటిస్తారేమోనని.. అన్ని ప్రాంతీయ పార్టీల విషయంలో అంతో ఇంతో క్లారిటీ ఉంది కానీ వైసీపీ (YCP) విషయంలోనే కొంత సందేహం అందరికీ.. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్డీఏ (NDA) కూటమికి సపోర్ట్ ఇస్తుందా? లేదంటే బీజేపీ తమ ప్రత్యర్థులతో చేతులు కలిపినందుకు ఇండియా కూటమికి మద్దతు ఇస్తుందా? అంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ. మొత్తానికి చర్చలకు ఫుల్స్టాప్ పెడుతూ వైసీపీ చావు కబురు చల్లగా చెప్పేసింది.
లేకుంటే అనలేదుగా..
ఇప్పుడు మరో రకమైన చర్చ జరుగుతోంది. జగన్ చేసేదేమీ లేకున్నా విమర్శలు మాత్రం దండిగానే చేస్తారని టీడీపీ (TDP) కార్యకర్తలు అంటుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని అప్పట్లో ఆయన విమర్శించారు. అదే తమ పార్టీ గానీ అధికారంలో ఉండి ఉంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటివన్నీ ఇస్తేనే తాము ఏ డెసిషన్కైనా మద్దతు ఇస్తాం.. లేదంటే ఇచ్చేదే లేదని తెగేసి చెప్పేవాళ్లమంటూ పలుమార్లు జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదు.. బీజేపీ (BJP)పై తిరగబడట్లేదని నానా రచ్చ జగన్ చేశారు. కట్ చేస్తే తమ మద్దతు ఎన్డీఏకేనని తేల్చేశారు. తప్పేమీ లేదులే అధికారంలో ఉండి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచిస్తామని చెప్పారు కానీ లేకుంటే అని కాదుగా..
టీడీపీ కేడర్ ఆగ్రహం..
ఏదో అధికార పార్టీని ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టాలన్న ఆలోచన తప్ప జగన్కు మరో ఆలోచన లేదనేది సుస్పష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అంతేకాదు.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ నుంచి దూరంగా ఆయన పొరపాటున వెళ్లరని ఈ స్టెప్తో అందరికీ అర్థమైంది. జగన్ క్లారిటీతోనే ఉన్నారు.. మనకే అర్థంకాక అనుమానాలు పెట్టుకున్నామని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తమ పార్టీకి సంబంధించి రాజ్యసభలో ఉన్న తొమ్మిది మంది, లోక్సభలో ఉన్న ముగ్గురూ సీపీ రాధాకృష్ణనే ఓటు వేస్తారని వైసీపీ అధినేత స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ కేడర్కు ఇది ఆగ్రహం తెప్పిస్తోంది. నిన్న మొన్నటి వరకూ తమ అధినేత చంద్రబాబును ఏం డిమాండ్ చేసి మద్దతు ఇస్తున్నారంటూ ప్రశ్నించిన జగన్.. ఇప్పుడేం డిమాండ్ చేసి తమ పార్టీ మద్దతు ఇస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవని ప్రశ్నించేవారు తెలుసుకోవాలి.
ప్రజావాణి చీదిరాల