దివ్యవాణి చౌదరి సారధ్యంలో "బాపు బొమ్మ - విశ్వ మహిళ" అవార్డ్స్..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని "బాపు బొమ్మ - విశ్వ మహిళ" పేరిట 2026 వ సంవత్సరానికిగాను దివ్యవాణి అవార్డ్స్ ప్రదానం చేశారు.
బాపుబొమ్మగా తెలుగువారి గుండెల్లో దివ్యవాణి చౌదరి శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఆ తరువాత సామాజిక - రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని "బాపు బొమ్మ - విశ్వ మహిళ" పేరిట 2026 వ సంవత్సరానికిగాను దివ్యవాణి అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెగా బాపు బొమ్మ శ్రీమతి కొణిదెల అంజనీదేవి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యూఎస్), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యూఎస్) తదితర ప్రముఖ మహిళామణులు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో హైదరాబాద్, దసపల్లా హోటల్లో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, "తెలుగు వన్" అధినేత కంఠంనేని రవిశంకర్, ప్రముఖ నటుడు - రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్. కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సినిమా రంగంతోపాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ దివ్యవాణి విశేష సేవలందిస్తున్నారు. "బాపు బొమ్మ- విశ్వ మహిళ" పేరుతో ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం.. మెగా మాతృమూర్తి కొణిదెల అంజనీదేవితో శ్రీకారం చుట్టడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించుకోవడం ద్వారా సమాజంలోని సాటి మహిళామణులందరిలో స్ఫూర్తిని రగిలించాలనే వజ్ర సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు దివ్యవాణి తెలిపారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దివ్యవాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "బాపు బొమ్మ - విశ్వమహిళ అవార్డ్స్" వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా దివ్యవాణి ప్రకటించారు.